హైదరాబాద్, జూలై 27 (నేటి ప్రజా తెలంగాణ):
తెలంగాణ ప్రభుత్వ గ్రీన్ కోర్ రాష్ట్ర డైరెక్టర్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్నకుమార్ ఉద్యోగ విరమణోత్సవం హైదరాబాద్లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఆడిటోరియంలో ఆదివారం రాత్రి పర్యావరణహితంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుత, మాజీ జిల్లా పర్యావరణ విద్య సమన్వయ అధికారులు, జిల్లా సైన్స్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై డా. ప్రసన్నకుమార్ అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ విద్య అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు.అంతేకాకుండా, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు శిక్షణ అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన గొప్ప శిక్షకుడిగా డా. ప్రసన్నకుమార్ గుర్తింపు పొందారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ తెలంగాణ బిడ్డగా ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. వివిధ శాఖల అధికారులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని సభలో గుర్తుచేసుకున్నారు.కార్యక్రమాన్ని పూర్తిగా పర్యావరణహితంగా, ఆదర్శవంతంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం విజయవంతం కావడంలో మంచిర్యాల జిల్లా మాజీ గ్రీన్ కోర్ సమన్వయాధికారి గుండేటి యోగేశ్వర్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులను సమన్వయం చేయడంతో పాటు ఐదు అడుగుల మెగా సన్మాన పత్రాన్ని రూపొందించి, సభ నిర్వహణలో విశేష సేవలందించారు.ఈ కార్యక్రమంలో పీసీబీ ప్రాజెక్టు ఆఫీసర్ డా. నాగేశ్వరరావు, డా. ప్రసన్నకుమార్ జీవిత భాగస్వామి డా. సుమమాలిని, గుండేటి యోగేశ్వర్, కంటె నర్సయ్య, భాస్కర్, మోహన్రావు, కిరణ్, గాంధారి ప్రభాకర్, టి. మాధవి, ఎన్. మాధవ రెడ్డి, రాష్ట్ర గ్రీన్ కోర్ ప్రాజెక్టు ఆఫీసర్లు విద్యాసాగర్, రాధిక, రాజశేఖర్, ధర్మేందర్, శాంతికుమార్, శ్రీధర్ తదితర అధికారులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

