రామకృష్ణాపూర్,జూలై01: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ గాంధారి మైసమ్మ రోడ్డు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజల భద్రత దృష్ట్యా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, వీధి దీపాల మార్పులపై సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే బోనాల జాతర సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.అలాగే జంక్షన్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. జాతీయ రహదారులపై వాహనాలను నిర్ణీత వేగ పరిమితిలో నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, రామకృష్ణాపూర్ ఎస్ఐ జే. శ్రీధర్, కాసిపేట ఎస్ఐ అంజనేయులు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజలు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

