టీకానపల్లి,ఆగస్టు 22(నేటి ప్రజా తెలంగాణ):టీకానపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో, మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మూఢనమ్మకాలు, గ్రామాల్లో నేరాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఎస్ఐ కిరణ్ కుమార్ సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రా పేరుతో లేదా ఓటీపీ చెప్పాలంటూ వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మవద్దని తెలిపారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.గ్రామాల్లో దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మూఢనమ్మకాల పేరుతో జరిగే మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్లో ప్రయాణించడం, నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఈ-చలాన్ల ద్వారా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, టీకానపల్లి గ్రామ ప్రజలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

