రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్పోస్ట్ను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచిర్యాల జోన్ తాండూర్ రేపల్లెవాడ వద్ద కొనసాగుతున్న వాహనాల తనిఖీలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించిన డీసీపీ, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.అక్రమ పశువుల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,సంబంధిత పత్రాలను పరిశీలించాలని ఆదేశించారు.అలాగే ప్రతి వాహన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగే పశువుల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీసీపీ,ప్రజలు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.అనుమానాస్పద రవాణా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు.ఈ తనిఖీల్లో తాండూర్ సీఐ దేవయ్య,బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు,తాండూర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

