మంచిర్యాల, ఆగస్టు 4: అభివృద్ధి పనుల పేరుతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇండస్ట్రియల్ పార్క్, మహాప్రస్థానం, రామగుండం వంతెన నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారాలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబు అండగా నిలుస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రఘునాథ్ రావు హెచ్చరించారు.

