శ్రీరాంపూర్,జూన్ 28:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సింగరేణికి చెందిన రూ.4.40 లక్షల విలువైన ఐరన్ పైపుల అక్రమ రవాణా కేసును పోలీసులు ఛేదించారు. శ్రీరాంపూర్ సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన 110 ఐరన్ పైపులను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.దర్యాప్తులో భాగంగా సింగరేణి సివిల్ సూపర్వైజర్ గంగళ్ల సందీప్, స్క్రాప్ వ్యాపారులతో కుమ్మక్కై ఐరన్ పైపులను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు. పైపులతో పాటు తరలింపుకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో సివిల్ సూపర్వైజర్తో పాటు ప్రైవేట్ ఉద్యోగి, డీసీఎం డ్రైవర్, మరో ముగ్గురు వ్యక్తులు, స్క్రాప్ వ్యాపారి బతినీ నరేష్ గౌడ్ కలిపి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను విచారించి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు.

