కరీంనగర్,ఆగస్టు 31,(నేటి ప్రజా తెలంగాణ): ప్రకృతిని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతి రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రకృతి మిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ అన్నారు.ప్రకృతి మిత్ర తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అవార్డు గ్రహీత కొత్తూరు ముకుందం ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని బ్యాంకు కాలనీ పార్కులో సోమవారం “ప్రకృతి రక్షణ.. మన బాధ్యత” అంశంపై స్థానిక ప్రజలు, వాకర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్రకృతి, జల వనరులు, అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. ప్రకృతికి విరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని, ప్రకృతి విపత్తుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మన జీవన అలవాట్లు నేల, గాలి, నీటికి హాని కలిగించకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ ప్రకృతి మిత్రులుగా మారాలని పిలుపునిచ్చారు. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి బట్ట సంచులను ఉపయోగించాలని సూచించారు. విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, సమీప దూరాలకు కాలినడకన లేదా సైకిల్పై ప్రయాణించాలని తెలిపారు.కొత్తూరు ముకుందం మాట్లాడుతూ మన ఆరోగ్యంతో పాటు భవిష్యత్ తరాల ఆరోగ్యకరమైన జీవనానికి ప్రకృతి పరిరక్షణ అత్యంత అవసరమని అన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.అనంతరం పార్కు సభ్యులకు రెండు బస్తాల సేంద్రియ ఎరువును ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రకృతి మిత్ర జిల్లా బాధ్యులు, సభ్యులు, బ్యాంకు కాలనీ వాకర్లు తదితరులు పాల్గొన్నారు.
previous post

