మంచిర్యాల,ఆగస్టు 31 (నేటి ప్రజా తెలంగాణ): నంబర్ ప్లేట్లు లేకుండా, అస్పష్టమైన నంబర్ ప్లేట్లతో, నంబర్ ప్లేట్లను టాంపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు 40 వాహనాలకు జరిమానాలు విధించారు.పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనన్ ఆధ్వర్యంలో సోమవారం (31-08-2026) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేకుండా, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా, నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా టాంపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను గుర్తించారు.నిబంధనలను ఉల్లంఘించిన 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు 40 వాహనాలపై జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులందరూ ఆర్టీఏ నిబంధనల ప్రకారం తమ వాహనాలకు స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని ట్రాఫిక్ సీఐ హనన్ సూచించారు.నంబర్ ప్లేట్లు లేకపోవడం లేదా నంబర్లు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అలాగే ఏదైనా నేరం జరిగిన సందర్భంలో సంబంధిత వాహనాలను, నిందితులను గుర్తించడం కష్టతరంగా మారుతుందని ఆయన తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ దృష్ట్యా నంబర్ ప్లేట్ల నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఇకపై కూడా నంబర్ ప్లేట్ల నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ హనన్ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని ఆయన కోరారు.

