క్యాతనపల్లి,ఆగస్టు 15(నేటి ప్రజా తెలంగాణ):స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ పరిధిలో మాంస విక్రయాలు చేపట్టరాదని క్యాతనపల్లి పురపాలక సంఘం జారీ చేసిన నోటీసులను ఉల్లంఘించిన హోటల్పై అధికారులు చర్యలు చేపట్టారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలోని హోటళ్లు, మాంస విక్రయ దుకాణాల్లో ఎలాంటి మాంస విక్రయాలు నిర్వహించరాదని పురపాలక సంఘం ముందస్తుగా నోటీసులు జారీ చేసింది. అయితే గద్దెరగడి ప్రాంతంలోని ఒక హోటల్లో మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు పురపాలక సంఘం అధికారులకు సమాచారం అందింది.సమాచారం మేరకు క్యాతనపల్లి పురపాలక సంఘం పారిశుద్ధ్య తనిఖీ అధికారి ఆర్. సునీల్ కుమార్, పర్యావరణ ఇంజినీర్ బి. సంతోష్, పారిశుద్ధ్య జవాన్ ఈ. శ్రీను హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చికెన్ బిర్యానీ, చికెన్ నూడుల్స్, చికెన్ రైస్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో నిబంధనలను ఉల్లంఘించిన హోటల్ను అధికారులు మూసివేశారు. అక్కడ లభించిన మాంసాహార ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని డంప్యార్డుకు తరలించారు. అనంతరం వాటిని డంప్యార్డులో పూడ్చిపెట్టారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాంస విక్రయాలపై విధించిన నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పురపాలక అధికారులు హెచ్చరించారు.

