రామగుండం,జులై 29:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలను వెల్లడిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక అవగాహన పోస్టర్ను విడుదల చేసింది.వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని, వరద నీటిలో పశువులను దాటించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని తెలిపారు.విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, కుంటలు, కాలువలు, జలాశయాల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, సెల్ఫీలు దిగడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు చిన్నారులను అప్రమత్తంగా పర్యవేక్షించాలని, వాహనదారులు వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలు, కల్వర్టులపై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.హఠాత్తుగా నీటి మట్టాలు పెరగడం, రోడ్లు మునిగిపోవడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, బలమైన గాలులు, మెరుపులు, విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే డయల్–100కు సమాచారం అందించాలని, పోలీస్ శాఖ జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించి తమతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

