హైదరాబాద్:ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని అందించడంలో విఫలమైన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామ పంచాయతీ పీఐఓపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ చర్యలు తీసుకుంది. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోవడంతో పంచాయతీ కార్యదర్శికి రూ.20 వేల జరిమానా విధించింది.భవన నిర్మాణ అనుమతులు, రికార్డుల కాపీల కోసం కె. కృష్ణ 2022 జూన్లో ఆర్టీఐ దరఖాస్తు చేశారు. సంబంధిత భవనంలో పేలుడు పదార్థాల నిల్వపై అనుమానాలు ఉండడంతో అనుమతుల వివరాలు కోరారు. అయితే సమాచారం అందుబాటులో లేదని పంచాయతీ అధికారులు సమాధానం ఇవ్వడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్ను ఆశ్రయించారు.విచారణ సందర్భంగా రికార్డులు నిర్వహించకపోవడంపై కమిషనర్ పి.వి.శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన అనుమతులకు సంబంధించిన రికార్డులను భద్రపరచడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.ఆర్టీఐ చట్టం కింద నిర్లక్ష్యం వహించినందుకు పీఐఓపై రూ.20 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని దరఖాస్తుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. అలాగే కోరిన రికార్డులను రెండు వారాల్లో అందించాలని పంచాయతీకి సూచించారు.

