మంచిర్యాల,జూన్ 5: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెడ్డి కాలనీ శాఖ మేనేజర్ అలోక్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్, మెప్మా సి.ఓ అరుణ ఆధ్వర్యంలో పీఎం స్వనిధి, క్రెడిట్ కార్డులు,స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ పథకాలపై ప్రత్యేక అవగాహన,నమోదు శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి తాకట్టు లేకుండా తొలి విడతలో రూ.10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ రుణం అందజేయబడుతుందని తెలిపారు. రుణాన్ని సకాలంలో చెల్లించిన లబ్ధిదారులకు రెండో విడతలో రూ.20,000, మూడో విడతలో రూ.50,000 వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందని వివరించారు. అంతేకాకుండా 7 శాతం వడ్డీ సబ్సిడీతో పాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి నెలకు గరిష్టంగా రూ.100 వరకు క్యాష్బ్యాక్ ప్రోత్సాహకాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.వీధి వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ, ముడిసరుకుల కొనుగోలు, పరికరాల సమకూర్పు, ఇతర వ్యాపార అవసరాల కోసం ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్, గుర్తింపు కార్డు, సంబంధిత అధికారుల సిఫార్సు పత్రం కలిగిన అర్హులైన వ్యాపారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.అలాగే క్రెడిట్ కార్డుల వినియోగం, వాటి ప్రయోజనాలు, నగదు రహిత లావాదేవీల ప్రాముఖ్యతపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వినియోగదారులు క్రెడిట్ కార్డులు పొందవచ్చని, అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం ద్వారా లభించే రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, సూక్ష్మ వ్యాపారాల అభివృద్ధి, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై వివరించారు.పొదుపు, క్రమబద్ధమైన లావాదేవీలు, రుణాల సకాల చెల్లింపుల ద్వారా మరింత అధిక రుణాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పథకాలపై సందేహాలను నివృత్తి చేసుకుని దరఖాస్తు ప్రక్రియపై అవగాహన పొందడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ పి లు జమీల, సాబేర,కళావతి, శ్రీవాణి, నజీమా, సునీత, జయశ్రీ, అనుష, స్రవంతి స్ట్రీట్ వెండర్స్ , ఎస్ హెచ్ జి మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

