నస్పూర్,జూన్ 4:మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్ మండల పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా సీసీసీ నస్పూర్ పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఈ తనిఖీలు చేపట్టారు.నస్పూర్ ప్రాంతంలోని పలు దుకాణాలు, పాన్ షాపులు, టీ స్టాల్స్, యువత ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు, ధూమపానం జరిగే ప్రదేశాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ ప్రశాంత్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా నిరంతరం తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్తో పాటు ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయం, నిల్వ లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

