తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి.అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన చరిత్ర,ఆత్మగౌరవ సాధన కోసం సాగిన ఉద్యమాల స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర పోషించనున్నట్లు స్పష్టం చేశాయి. ప్రజల పక్షాన నిలుస్తూ,వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టడం,సామాజిక అంశాలపై స్పందించడం, ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపాయి.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయనున్నట్లు వెల్లడించాయి.ముఖ్యంగా యువత,మహిళలు,రైతులు, కార్మికులు,ఉద్యోగులు,మేధావులను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి.బీసీలు,ఎస్సీలు,ఎస్టీలు,మైనార్టీలు సహా బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడం,కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని వివరించాయి.సామాజిక న్యాయం,సమాన అవకాశాల సాధన దిశగా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం,ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం,పారదర్శక రాజకీయ విధానాలతో తెలంగాణలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో జనసేన ముందుకు సాగుతోందని పార్టీ నాయకులు వెల్లడించారు.ప్రజల ఆకాంక్షల సాధన, రాష్ట్ర అభివృద్ధి,యువత భవిష్యత్ నిర్మాణమే తమ రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.

