తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి భారీగా విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా,డీసీపీ ఏ.భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.పెరికపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి రాజేశం, నెన్నెల గ్రామానికి చెందిన అట్కాపురం సురేష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా మొత్తం 55 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.1.32 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.నిందితులు తక్కువ ధరకు విత్తనాలు తెచ్చుకుని రైతులను మోసగించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.రైతులు అనుమతి పొందిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని పోలీసులు,వ్యవసాయ అధికారులు సూచించారు.

