మంచిర్యాల జిల్లాలో ఎండ తీవ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ సూచించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, పిల్లలు, మున్సిపల్ సిబ్బందికి వడదెబ్బపై వివరణ ఇచ్చారు.మహిళా సాధికారత, టీనేజ్ బాలికల ఆరోగ్యంపై నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన చేపట్టినట్లు తెలిపారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు,వేడి గాలుల కారణంగా వడదెబ్బ,డీహైడ్రేషన్ వంటి సమస్యలు సాధారణమని,సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రజలు ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని,మధ్యాహ్నం తీవ్ర ఎండలో బయట తిరగకూడదని సూచించారు.మద్యం సేవించరాదు,రోడ్లపై లభించే చల్లని రంగు పానీయాలు త్రాగరాదు, కలుషిత ఆహారం తీసుకోరాదని పేర్కొన్నారు.రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగడం,మజ్జిగ,గ్లూకోజ్ ద్రావణం,ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని,తాజా కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించి దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని,ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలని,అపస్మారక స్థితిలో ఉన్నవారికి నీరు త్రాగించకూడదని చెప్పారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.గర్భిణీలు,బాలింతలు,డయాబెటిస్,క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,స్కూల్లకు సెలవులు ఉన్నందున పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని కోరారు.చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బను నివారించవచ్చని,ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. పోస్టర్లు,కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

