June 3, 2026
Praja Telangana
తెలంగాణ

వడదెబ్బ నివారణ,పొగాకు దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన సదస్సు:జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

మంచిర్యాల,మే28:మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్,బెల్లంపల్లి చౌరస్తాలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ, పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బుక్క వెంకటేశ్వర్ ప్రజలు మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని, తరచూ నీరు తాగుతూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వెంట నీటి బాటిల్ ఉంచుకోవాలని, ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అధిక వేడి ప్రభావానికి త్వరగా గురయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. అదేవిధంగా పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధులు,శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని తెలిపారు.గుట్కా, సిగరెట్లు, పొగాకు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రజలకు సూచించారు.
ఇళ్లలో వృద్ధులు,బయట ఎండలో పనిచేసే కార్మికులు, ప్రయాణికులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తల తిరగడం,వికారం,తీవ్ర అలసట,తలనొప్పి,జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రజల అప్రమత్తతే ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలో స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కోఆర్డినేటర్ భారతి, కంట్రోలర్స్ డి.పీ.రావు, భీమయ్య, ఏపీడి మాలజిస్ట్ సుమన్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది

Share this