రామకృష్ణాపూర్,ఆగస్టు 21 (నేటి ప్రజా తెలంగాణ): తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనాథ కుటుంబానికి ‘అంజనిపుత్ర’ ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ అండగా నిలిచారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు అమరావాది గ్రామానికి చెందిన జీలకర్ర బాణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. తండ్రిని ఇప్పటికే కోల్పోయిన ఆమె చిన్న కుమార్తె ప్రియభారతి, తల్లి మృతితో పూర్తిగా అనాథగా మారింది.బాణమ్మకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిగాయి. వివాహం కాని చిన్న కుమార్తె ప్రియభారతిపై కుటుంబ బాధ్యతలు భారంగా మారాయి. తల్లి దశదిన కర్మ నిర్వహించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న విషయం గ్రామస్తుడు జిలకర సురేష్ ద్వారా గుర్రాల శ్రీధర్ దృష్టికి వెళ్లింది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన శ్రీధర్.. ప్రియభారతికి దశదిన కర్మ ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం గ్రామస్తుల చేతుల మీదుగా అందజేశారు. ఆపద సమయంలో మానవత్వంతో స్పందించి అండగా నిలిచిన గుర్రాల శ్రీధర్, జిలకర సురేష్లకు బాధితురాలు ప్రియభారతి, అమరావాది గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జిలకర మహేష్, మనోహర్, రాము, కిరణ్, ప్రవీణ్, రవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

