మందమరి,జులై 08:పట్టణంలో శాంతిభద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు వ్యాపారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం మందమర్రి పట్టణంలో రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణదారులు, వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రతి వ్యాపారి తమ దుకాణం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద నిఘా వ్యవస్థ ఉండడం వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో భయం ఏర్పడి నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.ఏదైనా నేరం జరిగినా నిందితులను వేగంగా గుర్తించడంలో, కేసులను త్వరగా ఛేదించడంలో సీసీ దృశ్యాలు పోలీసులకు మూడో కన్నులా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.రాత్రి వేళల్లోనూ, రద్దీ సమయాల్లోనూ నిఘా కొనసాగేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని వివరించారు. కెమెరాలు అమర్చే సమయంలో ఒకటి దుకాణం లోపలి భాగం,మరొకటి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వ్యక్తులు స్పష్టంగా కనిపించేలా అమర్చాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో వ్యాపారుల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సీఐ రమేష్ పిలుపునిచ్చారు. సమావేశానికి హాజరైన వ్యాపారులు పోలీసుల సూచనలకు సానుకూలంగా స్పందించి తమ దుకాణాల వద్ద త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణదారులు, వ్యాపారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

