హాజీపూర్,మే 21:హాజీపూర్ మండలం నన్నూర్ సెంటర్లో ధాన్యం కొనుగోలు,రవాణా సమస్యలపై రైతులతో మేప్మా సీఓ అరుణ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.ఇటీవల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగడం, మిల్లులకు తరలింపులో ఆలస్యం కావడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆమె స్పందిస్తూ త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రైతులు పండించిన ప్రతి గింజకు సరైన విలువ దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న సీఓ అరుణ, ఇప్పటికే కాంటా వేసిన ధాన్యపు బ్యాగులను లారీల ద్వారా మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.మరో రెండు నుంచి మూడు రోజుల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా పూర్తిగా మిల్లులకు పంపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆలస్యమైందనే కారణంతో ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని,ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన సీఓ అరుణ వారి సమస్యలను ఓర్పుతో విని పరిష్కార మార్గాలపై చర్చించారు. ధాన్యం తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు లారీలను ఏర్పాటు చేసి వేగంగా లోడింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.రైతులు కూడా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
previous post

