నస్పూర్ మే,21: నస్పూర్ మండల కేంద్రంలో గంజాయి,మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ఉదయం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్స్ వింగ్, మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీసుల సమన్వయంతో ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్నర్ ప్రాంతాలు, ఆటో స్టాండ్ పరిసరాలు, సమీప హోటళ్లు, పాన్ షాపులు,ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు, హోటళ్ల పరిసరాలు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,నిల్వలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని వాపోయారు. కాబట్టి ఈ మాదకదావ్యాల విషయంలో ప్రజల్లో అవగాహన తప్పనిసరి అని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

