శాంతియుత ఎన్నికల ప్రక్రియ కోసం కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమలు
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూర్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం, మంచిర్యాల జోన్ పరిధిలో దండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట మండలలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్న నేపథ్యంలోపైన తెలిపిన మండలాల్లో డిసెంబర్ 9న సాయంత్రం 5 గంటల నుండి ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ ఆంక్షల కాలంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధం. ఎన్నికల వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటు చేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, కేంద్ర బలగాలు, హోమ్గార్డులు, ఎస్ పి ఓ లకు మాత్రం ఈ నిషేధాలు వర్తించవని తెలిపారు. ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు చట్టపరమైన అనుమతిలేకుండా చేపట్టకూడదని, పోలింగ్ కేంద్రాలకు ఒక కిలోమీటర్ పరిధిలో కర్రలు, కత్తులు, తుపాకులు లేదా ఎలాంటి మారణాయుధాలతో సంచరించడం పూర్తిగా నిషేధమని సిపి స్పష్టం చేశారు. తాత్కాలిక నిర్మాణాలు అయిన షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి తప్పనిసరి అని చెప్పారు. మైకులు, లౌడ్ స్పీకర్ల ద్వారా పాటలు ప్రసారం చేయడం, సభలు నిర్వహించడం, ప్రజలను ఒక వర్గం మీద మరొక వర్గం మీద రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం నిషేధమని తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే విధమైన ప్రకటనలు, ప్లకార్డులు, గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు.

