నూతన కార్మిక నిబంధనలకు కేంద్రం ఆమోదం
కార్మిక సంఘాల తీవ్ర ఆక్షేపణ
కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక నిబంధనలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది కార్మిక కుటుంబాల హక్కులు, భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల ద్వారా లభిస్తున్న కనీస సౌకర్యాలు కూడా తగ్గిపోతాయని నాయకులు తెలిపారు.
ఈ నిబంధనలు పరిశ్రమలు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండగా, కార్మిక వర్గానికి భారంగా మారనున్నాయని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెల్లో సింగరేణి గని కార్మికులు కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు గని కార్మికులపై మరింత భారాన్ని మోపే అవకాశముందని సంఘాలు పేర్కొన్నాయి.
కార్మిక విరుద్ధ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు సంఘటిత పోరాటాలను కొనసాగించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో టి.మణి రామ్ సింగ్, ఎండి. చాంద్ పాషా, ఏ. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

