మంచిర్యాల,సెప్టెంబర్ 9(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ ఎస్. నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిరక్షణకు కాళోజి నారాయణరావు విశేష కృషి చేశారని అన్నారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ సమాజాన్ని చైతన్యపరిచిన ప్రజాకవిగా కాళోజి చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ భాషా వైశిష్ట్యాన్ని, ప్రజల జీవన విధానాన్ని తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎస్. హరీష్, తెలుగు విభాగం అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

