మంచిర్యాల, జూలై 21:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను మంచిర్యాల జోన్ డీసీపీ ఎ. భాస్కర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరు, రిసెప్షన్, స్టేషన్ రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్న డీసీపీ, అధికంగా నమోదవుతున్న నేరాల స్వరూపం, రౌడీ షీటర్ల వివరాలు, అనుమానితుల ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది విధుల నిర్వహణ, పెట్రోలింగ్ సమయాలపై కూడా ఆరా తీశారు.అనంతరం అధికారులకు పలు సూచనలు చేస్తూ కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ (CCTNS)లో సకాలంలో నమోదు చేయాలని, సాక్ష్యాధారాలను డిజిటల్ రూపంలో అప్లోడ్ చేయాలని సూచించారు. సంఘటన స్థలాల వీడియో చిత్రీకరణ, సాక్షుల వాంగ్మూలాల వీడియో రికార్డింగ్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేసుల్లో నేర నిరూపణ మరింత బలపడుతుందని తెలిపారు.ప్రతి పోలీస్ అధికారి రౌడీ షీటర్ల నివాసాలను తరచూ సందర్శించి వారి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్ కీలకమని పేర్కొన్న డీసీపీ, నిరంతర పెట్రోలింగ్తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వ్యాపార, రైల్వే అనుసంధాన ప్రాంతమైన మంచిర్యాలలో ఆస్తి సంబంధిత నేరాల నివారణకు బీట్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.బ్యాంకులు, ఏటీఎంలు, బంగారు దుకాణాలు, ఆర్థిక సంస్థల వద్ద పగలు, రాత్రి వేళల్లో ప్రత్యేక ఆయుధాలతో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కాలనీలు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

