మంచిర్యాల, జూలై 20: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్స్ ఆధ్వర్యంలో బాలికల భద్రత,డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఎస్ఐ ఉషారాణి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో గానీ, బయట గానీ ఎవరైనా వేధింపులకు పాల్పడినా లేదా అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, మహిళలు, బాలికలను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకు నిరాశ చెందకుండా తమ లక్ష్యంపై దృష్టి సారించి చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ మంచి విలువలు, క్రమశిక్షణ పెంపొందించేలా కృషి చేయాలని కోరారు.డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఎస్ఐ ఉషారాణి తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతిని, వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. అలాంటి పరిస్థితులు నేరాలకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు.చెడుస్నేహాలు, చెడు అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొంటూ, మంచి స్నేహితులను ఎంపిక చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్ వినియోగం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, అలాంటి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. ఎవరైనా మత్తు పదార్థాలు లేదా ఇతర చెడు వ్యసనాలకు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

