మంచిర్యాల జిల్లా పద్మశాలి భవన్లో తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చక్రధరి సురేందర్, ప్రధాన కార్యదర్శి భట్రాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ కార్యదర్శి కేసిపెద్ది రామరాజు, కేసిపెద్ది అంజలిలను సంఘం తరఫున ఘనంగా సన్మానించారు.అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భట్రాజు సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘ సభ్యుల ఐక్యత, సమన్వయంతో భట్రాజు సామాజిక అభివృద్ధికి ముందుకు సాగాలని సూచించారు.వచ్చే నెలలో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మహిళా కమిటీ, యూత్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో భట్రాజు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

