రామగుండం, జూలై 20: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను సీపీ స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని సీపీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుతో విని ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీస్ శాఖపై ప్రజల్లో భరోసా, విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, అందిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

