మందమర్రి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాసిపేట మండలం మామిడిగూడ ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం అమలు, గిరిజన ప్రాంతాల్లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మెడికల్ అధికారి మాట్లాడుతూ 30 ఏళ్లు పైబడిన వారికి అసంక్రమణ వ్యాధుల పరీక్షలు నిర్వహించడం, క్షయవ్యాధి రోగులను గుర్తించి నిశ్చయ్ పోర్టల్లో నమోదు చేయడం, గర్భిణీలకు నాణ్యమైన మాతా-శిశు సంరక్షణ సేవలు అందించడం, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.అలాగే 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందించి గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

