రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం ఉషారాణి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లను సంప్రదించాలని సూచించారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది,కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నయ్య,ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

