రామకృష్ణాపూర్,ఆగస్టు 5: ఈ నెల 9న ఆదివారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించనున్న గాంధారి బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు బుధవారం జాతర ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి కిరణ్ కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేశ్, కాసిపేట ఎస్ఐ అంజనేయులు, స్థానిక ఎస్ఐ శ్రీధర్ తదితరులు జాతర ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.జాతర సందర్భంగా నేషనల్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.నేషనల్ హైవే అథారిటీ అధికారి సునీల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సదుపాయాలను కూడా కల్పించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసు అధికారులు సూచించే ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

