మంచిర్యాల, ఆగస్టు 4: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని గ్రామపంచాయతీలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సంయుక్త ఆధ్వర్యంలో తల్లులు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నరేంద్ర రాథోడ్ మాట్లాడుతూ తల్లిపాలే శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం, తొలి ప్రేమ అని తెలిపారు. శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలని, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలల తర్వాత తగిన అదనపు ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. శిశువుకు అవసరమైనప్పుడల్లా తల్లిపాలు ఇవ్వాలని, బాటిల్ పాలు, పాలపొడి అలవాటు చేయకూడదని తెలిపారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని, జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు వంటి అనారోగ్యాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని పేర్కొన్నారు. తల్లికి కూడా ప్రసవానంతర రక్తస్రావం, రక్తహీనత తగ్గించడంలో, తల్లి-శిశువుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడంలో తల్లిపాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని నవజాత శిశు విభాగాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. హెల్ప్డెస్క్ ద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులు, తల్లులకు అరటిపండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్ అశోక్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రహూఫ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు, జిల్లా ప్రజా సంబంధాల అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య, నర్సింగ్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులు, తల్లులకు అరటిపండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

