జన్నారం, జులై 21:జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి తాళ్లపేట్, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వర్షాకాలంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని, కీటక జనిత, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, అతిసారం, టైఫాయిడ్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు.అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టాలని, ముప్పై సంవత్సరాలు పైబడిన వారికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు ఉమాశ్రీ, స్నేహిత, పర్యవేక్షకులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

