శ్రీరాంపూర్,జూలై 14:రాబోయే వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పర్యావరణహిత విత్తన బంతులతో తయారు చేసిన బంకమట్టి వినాయక విగ్రహాలనే పూజించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రకృతి మిత్ర ప్రతినిధులు సోమవారం శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న సింగరేణి యాజమాన్యం విత్తన బంతులతో రూపొందించిన ప్రకృతి సిద్ధమైన వినాయక విగ్రహాలను కార్మికులకు అందుబాటులోకి తీసుకువస్తే ఈ ప్రాంతంలో హరితవనం విస్తరణకు, జీవవైవిధ్య పరిరక్షణకు, జలవనరుల సంరక్షణకు, కాలుష్య నియంత్రణకు విశేషంగా దోహదపడుతుందని అన్నారు.వినతిపత్రంపై స్పందించిన శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, కార్మికులు, ఉద్యోగులకు విత్తన బంతులతో రూపొందించిన పర్యావరణహిత వినాయక విగ్రహాలను అందించే దిశగా సానుకూల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ విభాగం అధికారి హనుమాన్ గౌడ్, ప్రకృతి మిత్ర సభ్యులు, కుమ్మరి వృత్తి కళాకారుడు రాజేంద్ర ప్రసాద్, బి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

