మంచిర్యాల, జులై 14:జిల్లాలో ప్రజలకు ఇసుకను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్ల ద్వారా మాత్రమే సరఫరా చేస్తున్నట్లు గనులు, భూగర్భ శాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ముల్కల్ల ఇసుక రీచ్, తాళ్లపల్లి ఇసుక రీచ్, ఇందారం ఇసుక రీచ్, బతుకమ్మ ఇసుక రీచ్, కొల్లూరు ఇసుక రీచ్ ల ద్వారా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉందని పేర్కొంది. అదేవిధంగా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణాలకు, వివిధ గృహ అవసరాలకు అధికారిక ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకుని డీలర్ పాయింట్ల ద్వారా, నేరుగా రీచ్ల వద్ద నిబంధనల ప్రకారం ఇసుకను పొందవచ్చని సూచించింది.ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకం, అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు ప్రభుత్వ అనుమతి పొందిన రీచ్ల నుంచే ఇసుకను కొనుగోలు చేసి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు సహకరించాలని గనులు, భూగర్భ శాఖ విజ్ఞప్తి చేసింది.

