మంచిర్యాల, జూలై 13: నులిపురుగుల నిర్మూలన ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో నిర్వహించిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్తో కలిసి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత తగ్గి, పిల్లల పోషకాహార స్థాయి, మానసిక-శారీరక అభివృద్ధి, అభ్యాసన సామర్థ్యం, పాఠశాల హాజరు మెరుగుపడతాయని పేర్కొన్నారు.1–3 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను చూర్ణం చేసి నీటితో ఇవ్వాలని, 3–19 సంవత్సరాల పిల్లలు ఒక మాత్రను నమిలి తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు వినియోగించడం వంటి అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పాదరక్షలు లేకుండా తిరగడం, బహిరంగ మలవిసర్జన వంటి కారణాలతో నులిపురుగులు వ్యాపించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు నిర్వహించిన సమీకృత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. జూలై 13 నుంచి 15 వరకు నిర్వహించే శిక్షణలో ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా బోధించాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

