మంచిర్యాల,జూలై 6: ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ నెల 13న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు గ్రామాల్లోని పిల్లలకు కూడా ఆశా కార్యకర్తల ద్వారా మాత్రలు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 1,58,480 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక ఎదుగుదల, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. అందువల్ల అర్హులైన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. వయస్సును బట్టి మాత్రలు ఇవ్వాలని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోనే వాటిని పిల్లలకు తినిపించాలని స్పష్టం చేశారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు నులిపురుగుల నివారణకు ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవి, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, ఆర్.ఎస్. పద్మ, జిల్లా కార్యక్రమాల అధికారి ప్రశాంతి, సుమన్, సురేందర్, ఆర్బీఎస్కే వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

