వరంగల్,జూన్11:వరంగల్ జిల్లా కేంద్రం హరిత రిసార్ట్లో గల రుద్రమదేవి కన్వెన్షన్లో గురువారం రాష్ట్ర స్థాయి పర్యావరణ వేత్తల సమావేశం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రకృతిమిత్ర వ్యవస్థాపకుడు,పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్కు సమావేశ నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానం అందించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు.ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి వ్యక్తి పర్యావరణ హిత జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన పర్యావరణ కార్యక్రమాలపై పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. యోగేశ్వర్ ఆలపించిన “ఒక్కొక్కరు ఒక్క మొక్క” కవిత సభికులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది.మంచిర్యాల జిల్లాలో ప్రకృతిమిత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కల నాటకం,పర్యావరణ అవగాహన కార్యక్రమాలు,ప్లాస్టిక్ నిర్మూలన చర్యలను సమావేశంలో వివరించారు.అనంతరం ప్రకృతిమిత్ర రూపొందించిన పర్యావరణ హిత బట్ట సంచులను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ప్రకృతిమిత్ర ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందిస్తున్న సేవలను అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.వాల్టా అథారిటీ సభ్యునిగా యోగేశ్వర్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ రాష్ట్ర స్థాయిలో మరింత విస్తృతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత డీఎఫ్వో కాసిపేట పురుషోత్తం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల రవి,సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి శ్రావణ్ కుమార్,నరేందర్ రెడ్డి, పరశురాం,లక్ష్మణ స్వామి,ప్రకాష్,రాధ,సురేందర్,రమేష్తో పాటు వివిధ జిల్లాల పర్యావరణ సంస్థల ముఖ్య బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

