క్యాతనపల్లి, సెప్టెంబర్ 10 (నేటి ప్రజా తెలంగాణ):
రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు దుస్స శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్యాతనపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 16 మంది సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్గా రామిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పోలు దాసరి శ్రీనివాస్, కోశాధికారిగా పరికిపండ్ల రాజును ఎన్నుకున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు సభ్యులు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, విధి నిర్వహణకు సంబంధించి పలు తీర్మానాలు చేసి నియమ నిబంధనలు రూపొందించుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ జర్నలిస్టులు కలిసి రవీంద్రఖని ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దుస్స శివప్రసాద్ మాట్లాడుతూ రవీంద్రఖని ప్రెస్ క్లబ్ ప్రజాసేవకు అంకితమై పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలిచి, వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు, హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ప్రెస్ పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడినా, ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా తమ క్లబ్ సభ్యుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.ప్రెస్ పేరుతో కొందరు చేస్తున్న అక్రమ వసూళ్లపై ప్రజల్లో ఆందోళన ఉందని, తమపై ఫిర్యాదు చేస్తే పోలీసులు, రాజకీయ నాయకులు పట్టించుకోరనే అపోహను ప్రజలు వీడాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ చట్టపరమైన హక్కులు ఉన్నాయని, ఎలాంటి సమస్య ఎదురైనా రవీంద్రఖని ప్రెస్ క్లబ్ సభ్యులను సంప్రదించవచ్చని తెలిపారు.జర్నలిస్టులు సమాజంలో సైనికుల్లా నిబద్ధతతో పనిచేసినప్పుడే పేదలు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రలోభాలకు లోనై నాలుగో స్తంభం బలహీనపడుతున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలిచి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. పట్టణంలోని ఇతర ప్రెస్ క్లబ్లకు అతీతంగా రవీంద్రఖని ప్రెస్ క్లబ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో తూముల భవిష్యత్, మామిడాల రవీందర్, కందుల ప్రవీణ్, రామిడి సాయి సృజన్, కరెడ్ల రఘు, దండు సదానందం, నరెడ్ల వెంకన్న, కోల శ్రీనివాస్, బొద్దుల భూమయ్య, బత్తుల సతీష్ కుమార్, అప్పని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

