మంచిర్యాల, సెప్టెంబర్ 2 (నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో మంచిర్యాల టౌన్ ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని లాడ్జ్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ లాడ్జీలలో తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లాడ్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చరాదని స్పష్టం చేశారు.లాడ్జీలలో బస చేసేందుకు వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు వారి ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా తీసుకుని భద్రపరచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.అలాగే లాడ్జీలలో మద్యపానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సహకరించరాదని నిర్వాహకులకు సూచించారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ఉల్లంఘించే లాడ్జ్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మంచిర్యాల టౌన్ సీఐ ప్రమోద్రావుతో పాటు పట్టణ ఎస్ఐలు, లాడ్జ్ నిర్వాహకులు పాల్గొన్నారు.

