మంచిర్యాల,ఆగస్టు 29(నేటి ప్రజా తెలంగాణ):నేత్రదాన అవగాహన పక్షోత్సవాల్లో భాగంగా మంచిర్యాలలోని సాయి కుంట గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నేత్రదానం, కంటి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ విద్యార్థులకు కంటి సంబంధిత వ్యాధులు, కంటి చూపును కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు.నేత్రదానం ద్వారా మరొకరికి కంటి చూపును అందించి వారి జీవితంలో వెలుగులు నింపవచ్చని తెలిపారు. నేత్రదానం ప్రాముఖ్యతను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, గ్రామాల్లోని ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని సూచించారు.విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వంటి కీటక జనిత వ్యాధులు, జాండీస్, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మంచినీటిని మాత్రమే తాగాలని, ఆహారాన్ని వేడిగా, పరిశుభ్రంగా తీసుకోవాలని, బయట లభించే అపరిశుభ్రమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. జంక్ఫుడ్కు దూరంగా ఉండి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.చిన్నపాటి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స పొందాలని, ఆరోగ్య కార్యకర్తల సూచనల మేరకు ముందస్తు చర్యలు చేపట్టి అవసరమైన మందులు వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సీహెచ్ఓలు నాందేవ్, పుట్ట సత్తయ్య, కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ పద్మ, జిల్లా కంటి నియంత్రణ కోఆర్డినేటర్ శంకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

