మంచిర్యాల, ఆగస్టు 14: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంచిర్యాల జిల్లాలో రెండు నెలల విస్తృత సమాచార, విద్యా, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన స్వీయ ప్రమాద అంచనా కోసం ప్రత్యేక సంకేతాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా జిల్లాలోని ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఈ సంకేతాలను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్కు సంబంధించిన అనుమానాలు, సందేహాల నివృత్తి కోసం జాతీయ ఉచిత సహాయవాణి 1097ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సహాయవాణి 14 భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వీయ ప్రమాద అంచనా సంకేతాన్ని, సహాయవాణి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన వారు సమీపంలోని సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాల్లో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, దిశా సీపీఎం నీలిమ, సీఎస్ఓ రాజేష్, డీఎండీఓ సంతోష్, టీఐ స్నేహ, పీఎం పవన్, డీపీఓ ప్రశాంతి, ఎల్డబ్ల్యూఎస్ పర్యవేక్షకుడు శ్రీకాంత్, డీపీసీ టీబీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

