భీమారం,జూలై 4:పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి యత్నించిన వ్యక్తికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ విషయాన్ని భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ శనివారం వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 2న మధ్యాహ్నం డయల్-100కు అందిన ఫిర్యాదు మేరకు బ్లూ కోల్ట్స్ పోలీసులు భీమారం మండలంలోని బోయవాడకు చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ కలహం జరుగుతోందని సమాచారం అందడంతో ఘటన స్థలానికి వెళ్లగా, మద్యం మత్తులో ఉన్న చొప్పరి శేఖర్ పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడడంతో పాటు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు.పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి చెన్నూరు కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఎ. రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు చట్టబద్ధమైన మార్గంలో పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

