ఆదిలాబాద్,జూన్ 22:జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్–1861 అమలులోకి తీసుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ స్థాయి లేదా అంతకంటే పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందకుండా ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకూడదని సూచించారు.అలాగే నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వంటి ప్రమాదకర వస్తువులను కలిగి ఉండటం చట్ట విరుద్ధమని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగే సమావేశాలు, జనసమూహాలపై కూడా నిఘా ఉంటుందని పేర్కొన్నారు.అనుమతి లేకుండా డీజేలు, మైకులు, స్పీకర్లు, ప్రచార వాహనాలు వంటి ధ్వని పరికరాలను వినియోగించరాదని తెలిపారు. బైకులు, కార్లు, ఇతర వాహనాలతో ర్యాలీలు, యాత్రలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.

