కరీంనగర్,మే30: ప్రకృతి,పర్యావరణం,అడవుల సంరక్షణతో పాటు కాలుష్య నివారణ లక్ష్యంగా ఏర్పాటైన “ప్రకృతిమిత్ర” తెలంగాణ పర్యావరణ సామాజిక సంస్థ సభ్యులు శుక్రవారం కరీంనగర్ జిల్లా అటవీ శాఖాధికారి ఎస్.సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ,పర్యావరణ అవగాహన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకులు,రాష్ట్రపతి అవార్డు గ్రహీత,తెలంగాణ ప్రభుత్వ వాల్టా నీరు-చెట్టు-నేల సంరక్షణ రాష్ట్ర అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ సభ్యులు,లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ హర్జిత్ సింగ్,వృక్ష ప్రేమికుడు పుల్లె సత్యనారాయణ,పర్యావరణ పరిరక్షకుడు గద్దె రవికుమార్ హాజరు కావడం జరిగింది.అనంతరం ప్రకృతిమిత్ర ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు,మొక్కల పెంపకం,అవగాహన సదస్సులు,అడవుల సంరక్షణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను వివరించారు.ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖాధికారి ఎస్.సత్యనారాయణ,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్ ప్రకృతిమిత్ర చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు అటవీ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రకృతిమిత్ర సభ్యులు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి.నాగేశ్వర్ రావు,చందుర్తి-మల్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖలీలుద్దీన్,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

