రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్లను పిలిపించి ఎస్సై జె.శ్రీధర్ చట్టపరమైన నిబంధనలు,శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బెదిరింపులు, గొడవలు,అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్తో పాటు ఇతర కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలంటే సత్ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు.నేరాలకు దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిచే వారి రౌడీషీట్ల తొలగింపుపై సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు.ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని ఆయన పేర్కొన్నారు.రౌడీషీటర్లలో మార్పు తీసుకురావడం, వారిని సన్మార్గంలో నడిపించడమే కౌన్సెలింగ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

