ప్రస్తుతం చిన్న వయసులోనే కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ప్రముఖ కిడ్నీ వైద్యులు డాక్టర్ రాకేష్ చెన్న తెలిపారు. జీవనశైలి మార్పులు, షుగర్, బీపీ, తగినంత నీరు తాగకపోవడం, అధిక ఉప్పు వినియోగం, పొగతాగడం, మద్యపానం వంటి కారణాలతో కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతింటున్నాయని చెప్పారు. సమస్య తీవ్రమైతే డయాలసిస్ తప్పదని, అందుకే ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరమన్నారు.డయాలసిస్ చేయించుకునే రోగులు నీటి వినియోగంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజుకు బయటకు వెళ్లే మూత్ర పరిమాణానికి అదనంగా సుమారు 500 మిల్లీలీటర్ల వరకు మాత్రమే నీరు తీసుకోవాలని తెలిపారు. ఎక్కువ నీరు తీసుకుంటే శరీరంలో వాపులు, శ్వాస సమస్యలు, గుండెపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. వైద్యులు సూచించిన ఆహార నియమాలు, మందులు తప్పనిసరిగా పాటించాలన్నారు.
కిడ్నీ సమస్యలు లేని వారు కూడా నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ రాకేష్ చెన్న సూచించారు. రోజుకు 1.5 నుండి 2 లీటర్ల వరకు నీరు తాగడం, సమయానికి మూత్ర విసర్జన చేయడం, శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవడం అవసరమన్నారు. ఎండాకాలంలో డీహైడ్రేషన్ కారణంగా మూత్రం గాఢరంగులో రావడం, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.బీపీ,షుగర్ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ రెండు వ్యాధులు నియంత్రణలో లేకపోతే కిడ్నీలు త్వరగా దెబ్బతింటాయని చెప్పారు. జంక్ ఫుడ్, అధిక ఉప్పు, అధిక ప్రోటీన్ ఆహారాన్ని తగ్గించాలని, రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని సూచించారు. పొగతాగడం, మద్యపానం, గుట్కా, పొగాకు వంటి అలవాట్లు పూర్తిగా మానేయాలని తెలిపారు. అలాగే పెయిన్ కిల్లర్స్ వైద్యుల సలహా లేకుండా ఎక్కువగా వాడకూడదన్నారు.40 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సియుఈ, ఆర్ఎఫ్టి వంటి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రాకేష్ చెన్న సూచించారు. ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు.

