మందమర్రి,సెప్టెంబర్ 4 (నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ఫోర్స్, నార్కోటిక్ టీమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మందమర్రి, తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు.ఈ రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 57 పశువులు, 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మందమర్రి టోల్ప్లాజా వద్ద 30 పశువులు
కౌటాల నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమర్రి టోల్ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్/నార్కోటిక్ టీమ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.పశువులతో వెళ్తున్న మూడు మహీంద్రా క్యాంపర్ వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా 13 ఆవులు, 17 దూడలు కలిపి మొత్తం 30 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు డ్రైవర్లు, నలుగురు సహాయకులు కలిపి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు మహీంద్రా క్యాంపర్ వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాళ్లగురిజాలలో మరో 27 పశువులు
బెజ్జూర్ గ్రామం నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ బృందం తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లగురిజాల గ్రామంలో తనిఖీలు నిర్వహించింది.ఈ సందర్భంగా రెండు మహీంద్రా క్యాంపర్ వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా 20 ఆవులు, 7 దూడలు కలిపి మొత్తం 27 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సహాయకులు కలిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మహీంద్రా క్యాంపర్ వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు, మొబైల్ ఫోన్లు, పశువులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

