మంచిర్యాల, ఆగస్టు 9: మంచిర్యాల పట్టణంలోని వడ్డెర కాలనీ సమీపంలో నడిరోడ్డుపై సంచరిస్తున్న రెండు గోవులను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం గుర్తించి, సురక్షితంగా హాజీపూర్లోని ఆర్ఎస్ఎస్కు సంబంధించిన గ్రామ వికాస్ గోశాలకు తరలించారు. రోడ్లపై పశువుల సంచారం వల్ల వాహనదారులకు, ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం మాట్లాడుతూ.. ఆవులు, గేదెలను రోడ్లపై వదిలివేస్తున్న యజమానులకు ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించి, వాటిని సురక్షితంగా తమ ఆధీనంలో ఉంచుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. రోడ్లపై పశువులు సంచరించడం వల్ల రోడ్డు భద్రతకు విఘాతం కలగడంతో పాటు ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల రోడ్లపై కనిపించే పశువులను గుర్తించి సురక్షితమైన గోశాలలకు తరలిస్తున్నట్లు వివరించారు.గోశాలకు తరలించిన పశువులకు సంబంధించిన యజమానులు ఉంటే నెల రోజుల్లోపు గోశాలను సంప్రదించి, తగిన వివరాలు సమర్పించి వాటిని తీసుకెళ్లాలని సూచించారు. నిర్ణీత గడువులోగా యజమానులు పశువులను తీసుకెళ్లని పక్షంలో సంబంధిత గ్రామాలకు చెందిన రైతులతో ప్రత్యేక ఒప్పందం చేసుకుని గోవులు, గేదెలను వారికి అప్పగించే చర్యలు చేపడతామని తెలిపారు.ఇకపై పశువుల యజమానులు తమ ఆవులు, గేదెలను బాధ్యతగా సంరక్షిస్తూ రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం కోరారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బ్లూ కోర్ట్ పోలీస్ సిబ్బంది, గోశాల సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

