భీమారం, ఆగస్టు 5:మంచిర్యాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. బుధవారం భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, మాతా శిశు సంరక్షణ తదితర అంశాలను పరిశీలించారు.ఉపకేంద్రాలు, గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర మందులతో పాటు మలేరియా, డెంగ్యూ పరీక్షా కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలుషిత నీటి కారణంగా డయేరియా, జాండీస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందించాలని, 30 ఏళ్లకు పైబడిన వారికి అసంక్రమణ వ్యాధులపై పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల నమోదు, పరీక్షలు, ఆసుపత్రి ప్రసవాలు, చిన్నారులకు వంద శాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో ప్రతిరోజూ పర్యటిస్తూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.భీమారం పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన డీఎంహెచ్ఓ, ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించేందుకు ఐఈసీ డిస్ప్లే ఏర్పాటు చేయాలని సూచించారు. పీహెచ్సీలో నిర్వహించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధి సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ విస్కీమల్ల విజయలక్ష్మి, పున్నమి చందర్, నల్లాల రాజేందర్, రాజకుమార్ నాయక్, కొత్త సత్తిరెడ్డి, వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్ఓ నాందేవ్, వెంకట సాయి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

